గాయని బేబి గత నెల రోజులుగా ఈ పేరు మీడియా లో మారుమోగుతూనే ఉంది. నాలుగు పదుల వయసు దాటిన ఈ గ్రామీణ గాయని ఓ సాధారణ మహిళ. ఆమె భర్త డ్రైవర్గా పని చేస్తున్నారు. ‘ప్రేమికుడు’ సినిమాలోని ‘ఓ చెలియా.. నా ప్రియ సఖియా’ అనే సెమీక్లాసికల్ శైలిలో ఉండే పాటను అలవోకగా పైస్థాయి రాగాలను సైతం హాయిగా, శ్రవణానంద భరితంగా, మాధుర్యంగా పాడేయడం.. నెటిజన్లకు ఓ అద్భుతంలా అనిపించింది. అంతే ఈమె పాడిన పాటను వైరల్ చేసారు. సాక్షత్ రెహమాన్ సైతం ఈమె గానానికి ఫిదా అయ్యాడు. ఆయన దగ్గరి నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఈమె గురించి మాట్లాడుకోవడం , కలుసుకోవడం చేసారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు బేబీ ని సత్కరించారు. వ్యవసాయ కూలీగా ప్రారంభమైన ఆమె ప్రస్థానం సినీ పాటలతో లక్షల మంది ఆన్లైన్ శ్రోతలను మెప్పించడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. చక్కని స్వరంతో పాడిన పాటకు చంద్రబాబు ఫిదా అయ్యారు. ఆమె ప్రతిభను మెచ్చుకొని సన్మానించారు. ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశించారు. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఈ రోజు ఉండవల్లిలోని ఆయన నివాసంలో చంద్రబాబుకు బేబీని పరిచయం చేశారు.
ప్రస్తుతం బేబీ కి సినీ అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ఈమెతో పాట పండించాలని చూస్తున్నారు.