Medaram Jatara : భక్తుల ఇంటికే మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం !!


తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి TSRTC శ్రీకారం చుట్టింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది.

మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు జరుగుతుండగా.. ఈ నెల 14 నుంచి 25వ తేది వరకు ఆన్‌లైన్‌/ఆఫ్ లైన్ లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు రూ.299 చెల్లించి బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్లలో ఈ సేవ అందుబాటులో ఉంటుందని తెలిపారు. పీసీసీ ఏజెంట్స్ తో పాటు డిపోల పరిధిలో విధులు నిర్వర్తించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించి ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చని తెలిపారు. లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు ఆన్ లైన్ లో పేటీఎం ఇన్ సైడర్ పోర్టల్ లో గానీ, యాప్ లోనూ సులువుగా ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ బుకింగ్‌ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా, పిన్‌ కోడ్‌, ఫోన్‌ నంబర్‌ ను తప్పనిసరిగా నమోదుచేయాలన్నారు. ఈ బుకింగ్‌ సదుపాయం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బుక్‌ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుంది అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ గారు అన్నారు.

అంతేకాదు మేడారం ప్రసాద బుకింగ్‌ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గానీ, టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లైన 040-69440069, 040-69440000, 040-23450033 సంప్రదించాలని ఆయన సూచించారు.