లోక సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నాలుగో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముంబయి సహా దేశంలోని 71 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ లో సామాన్య ప్రజలు, సినీ , రాజకీయ , బిజినెస్ రంగాలకు చెందిన వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సహా పలువురు ప్రముఖులు సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు సునీల్గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలు ముంబైలో ఓటు వేశారు. అనిల్ అంబానీ ముంబయిలోని జీడీ సొమానీ పాఠశాలలో ఏర్పాటు చేసిన 216 నెంబరు పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబయి టార్డియో రోడ్డులోని 31వ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ నటి, ఉత్తర ముంబయి కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళా మతోండ్కర్ బాంద్రాలో ఓటు వేశారు. అలాగే ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ప్రముఖ నటి రేఖా, ప్రియాంక చోప్రాతో పాటు పలువురు ఇతర బాలీవుడ్ ప్రముఖులు వివిధ ప్రాంతాల్లో ఓటేశారు.