అభిమానులను సున్నితంగా హెచ్చరించిన పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ నిర్మాణం మరియు బలోపేతం కోసం తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే తెలంగాణలో పర్యటించిన పవన్‌ ఏమాత్రం గ్యాప్‌ తీసుకోకుండా వెంటనే అనంతపురం జిల్లాలో తేలాడు. రెండు రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించి అక్కడ ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో తెలుగు దేశం పార్టీ నాయకురాలు పరిటాల సునీతతో భేటీ అయ్యారు. ముందు ముందు తాను ఇంకా పలు ప్రాంతాల్లో పర్యటిస్తాను అంటూ పవన్‌ చెప్పుకొచ్చాడు.

తనకు ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ప్రజల్లో తిరగాలని ఉందని, అయితే తన కోసం అభిమానులు సమయం వృదా చేసుకోవడంతో పాటు, కొన్ని సార్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఫీట్లు చేస్తున్నారు. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ పర్యటన సందర్బంగా కొన్ని చోట్ల ఫ్యాన్స్‌కు గాయాలు అయిన విషయం తెల్సిందే. ఆ విషయం పవన్‌కు చాలా బాధను కలిగించిందట. అందుకే పవన్‌ తన ఫ్యాన్స్‌కు సున్నితంగా హెచ్చరికలు జారీ చేశాడు. తన పర్యటనకు వచ్చే సమయంలో జాగ్రత్తగా రావాలని, సంతోషంగా ఉండాలని, ఎలాంటి హడావుడి అక్కర్లేదని, హంగామాలతో తనకు స్వాగతం పలకాల్సిన అవసరం లేదు అంటూ పవన్‌ చెప్పుకొచ్చాడు. పవన్‌ ప్రకటనతో అయినా ఫ్యాన్స్‌ తగ్గుతారేమో చూడాలి.