మోడీ, బాబులకు పవన్‌ మరో ఛాన్స్‌?

2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ కేంద్రంలో మోడీకి, రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికిన విషయం తెల్సిందే. పార్టీ పెట్టి పోటీకి అవకాశం ఉన్నా కూడా పవన్‌ కళ్యాణ్‌ తన అభ్యర్థులను పోటీకి దించకుండా తెలుగు దేశం మరియు బీజేపీలకు మద్దతు తెలిపి ఆ పార్టీ తరపున ప్రచారం చేసిన విషయం తెల్సిందే. పవన్‌ మద్దతుతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అత్యధిక స్థానాలు దక్కించుకుని సీఎం అయ్యాడు. పవన్‌ స్నేహంతో మోడీకి పెద్దగా లాభం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడుకు మాత్రం కలిసి వచ్చింది. అయితే ఎన్నికలు అయిన కొన్నాళ్లకే మోడీ మరియు చంద్రబాబు నాయుడులపై పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానంటూ మోడీ ఇచ్చిన హామీ తుంగలో తొక్కాడని, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేదల పక్షంలో నిలవకుండా ఉన్నత వర్గాల వారికే తన మద్దతు అంటూ పాలన సాగిస్తున్నాడు అంటూ పవన్‌ పదే పదే విమర్శలు చేశాడు. తెలుగు దేశం మరియు బీజేపీ నాయకులు కూడా పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దాంతో 2019లో టీడీపీ మరియు బీజేపీలతో పవన్‌ పొత్తు ఉండదని అంతా భావించారు. కాని తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏపీలో చంద్రబాబు నాయుడుతో, కేంద్రంలో బీజేపీతో, తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో తాను మోడీతో భేటీ కాబోతున్నానని, ఆ భేటీలో ప్రజల సమస్యలు ఆయన ముందుకు తీసుకు వెళ్తాను అంటూ పవన్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కూడా ఇటీవల పవన్‌ కాస్త మెతక వైఖరీతో మాట్లాడుతూ ఉన్నాడు. టీడీపీ నాయకులు చాలా క్లోజ్‌గా పవన్‌కు దగ్గరగా ఉంటున్నారు. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే పవన్‌ మరోసారి మోడీ మరియు బాబులకు ఛాన్స్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్‌కు లేదా వైకాపాకు అధికారం కట్టబెట్టడం పవన్‌కు అస్సు ఇష్టం లేదు. ఆ కారణంగా చంద్రబాబు నాయుడుకు తప్ప పవన్‌కు మరో ఛాన్స్‌ లేదు. అందుకే టీడీపీకే తన మద్దతు ఇవ్వాలని పవన్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పొత్తు విషయంలో త్వరలోనే పవన్‌ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మోడీతో జరగబోయే భేటీ సామరస్య పూర్వకంగా, సానుకూల వాతావరణంలో జరిగితే తప్పకుండా 2019లో మళ్లీ బీజేపీకి పవన్‌ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. ఎన్నికలకు ఇంకా సంవత్సరంకు పైగా ఉంది, ఈ లోపు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.