Praja Palana : ‘ప్రజా పాలన’ దరఖాస్తులు రోడ్ల పాలు..


తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో ప్రజల సమస్యలతో పాటు.. అభయహస్తం పేరిట పలు పథకాలకు దరఖాస్తులను స్వీకరించింది. అయితే ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్స్ రోడ్ల పాలయ్యాయి. బాలానగర్ ఫ్లైఓవర్ పై బైక్ పై నుంచి ఫామ్స్ ఎగిరి చిందరవందరగా పడిపోయాయి.

ఓ వ్యక్తి రాపిడో వాహనం మీద అట్టపెట్టెలో తీసుకు వెళ్తుండగా తాడు తెగి దరఖాస్తులు అన్నీ రోడ్ మీద పడటంతో ప్రజలు చూసి ఖంగుతుని ఇవి నీ చేతుల్లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎవరో రాపిడో బుక్ చేస్తే తాను తీసుకెళ్తున్నానని సదరు బైకర్ తెలిపారు. ఈ దరఖాస్తులు హయత్ నగర్ పరిధిలోనివి అని గుర్తించారు. ప్రజా పాలన అప్లికేషన్లు ఆన్లైన్ డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు 5 రూపాయల చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారని, అందుకే వీటిని తీసుకెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా, తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయితీలు, 3,623 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సభలను నిర్వహించగా, మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 ఉన్నాయి.