రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం, 2.80 కోట్లు కాజేసిన ..


హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్ మేనేజర్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఖాతాదారులకు తెలియకుండా వారి డాక్యుమెంట్లు తీసుకుని ఏకంగా 2.80 కోట్లు కాజేశారు . ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే …

రామంతాపూర్ లోని SBI బ్రాంచిలో భగీరథ గంగ మల్లయ్య మేనేజర్ గా గతేడాది జులై 27 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పని చేశారు. ఇదే సమయంలో షేక్ సైదులు SBI కి సంబంధించిన సీసీజీ బ్రాంచిలో మేనేజర్ గా పని చేశాడు. వీరిద్దరు కలిసి 19 మంది వినియోగదారుల రుణాలను మింగేశారు. ఎవరైతే వ్యక్తిగత రుణాలు కావాలని బ్రాంచ్ కి వస్తారో ముందుగా వారి నుంచి కావాల్సిన అన్ని రకాల డాక్యుమెంట్లను తీసుకుంటారు. ఆ తర్వాత వారికి రుణం పొందే అర్హత లేదంటూ చెప్పేసి అదే డాక్యుమెంట్లతో రుణాలను తీసుకున్నారు. వీటిలో ప్రధానంగా ఫారం-16ను ఫోర్జరీ చేసి, తప్పుడు అకౌంట్ స్టేట్ మెంట్లను సృష్టించి ఈ దందా చేశారు. వినియోగదారుల పేరుతో మంజూరైన రుణం డబ్బులను షేక్ సైదులు, అతడి భార్య షేక్ సుష్మ, కుమారుడు షేక్ పీరయ్యలకు సంబంధించిన అకౌంట్లకు బదిలీ చేసేవాడు. ఈ విధంగా 19 మంది వినియోగదారులకు సంబంధించిన రూ.2 ,84,80,000 డబ్బును సుష్మ, పీరయ్య అకౌంట్లకు మళ్లించారు. ఇదంతా కూడా గంగ మల్లయ్య సహకారంతో షేక్ సైదులు దారి మళ్లించారు.

గంగ మల్లయ్య బదిలీ అనంతరం వీర వసంత రాయుడు మేనేజర్ గా వచ్చారు. గతంలో రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారు బ్రాంచ్ కి వచ్చి మేనేజర్ ని, కలిసి లోన్ గురించి ఆరా తీశారు. పరిశీలించి చూస్తే అప్పటికే రుణం తీసుకొని తిరిగి చెల్లించని స్థితిలో బ్యాంకు జాబితాలో కనిపించింది. దీంతో వినియోగదారులు షాక్కు గురయ్యారు. దీనిపై ముందుగా బ్యాంకు మేనేజర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ జరిపి రూ.2.88 కోట్లు దారి మళ్లాయనే విషయాన్ని గుర్తించారు. ఇటీవల ఈ కేసును ఉప్పల్ పోలీసులకు బదిలీ చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. షేక్ సైదులు, సుష్మ, పీరయ్య, మేనేజర్ గంగ మల్లయ్య అందరూ పరారీలో ఉన్నట్లు తెసులుస్తుంది.