ట్రంప్ లో పెరుగుతున్న అసహనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరుకు అడ్డు అదుపు వుండదు. తాజాగా అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీపై ట్రంప్ నోరుపారేసుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ కట్టడి విషయంలో ట్రంప్‌  విధానాల్లో లోపాలను నిర్మోహమాటంగా చెప్పే ఫౌచీ తీరు అధ్యక్షుడికి కంటగింపుగా మారింది.

 మాస్కుల వాడకంపై నిర్లక్ష్యం, అలాగే కొవిడ్ చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ అని తేలకముందే శ్వేత సౌధానికి వచ్చి మాస్క్‌ను పక్కనపెట్టేయడం.. ఇలా అధ్యక్షుడి ప్రతి చర్యను ఫౌచీ తప్పుపడుతూనే ఉన్న విషయం తెలిసిందే. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ ఆయనపై అక్కసు వెళ్లగక్కారు. ‘‘ఏదేమైనా మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అని ప్రజలు అంటున్నారు. కొవిడ్‌తో వారు అలసిపోయారు. ఫౌచి, ఇతరులు చెప్పే మాటలు విని అలసిపోయారు’’ అంటూ  తన అసహనం వెళ్లగక్కారు