రైతులు జాగ్రత్త..నివర్ తుఫాను గండం రాబోతుంది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో వాన గండం రాబోతుంది. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్ర నష్టపోగా…ఇప్పుడు నివర్ తుఫాను గండం పట్టుకుంది. ఈ తుఫాను కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశమున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. వ్యవసాయ, వైద్యారోగ్య, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అయితే కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట సహా మినుము, పత్తి, సన్ ఫ్లవర్ తదితర పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

పంట కోతలు వీలైనంత త్వరగా చేపట్టాలని రైతులకు హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలు తుపానుతో తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేస్తోంది.