
Vijay Devarakonda : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో అమెరికా, న్యూయార్క్లో జరిగే ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ లో ఆయన గ్రాండ్ మార్షల్గా వ్యవహరించనున్నారు. ఈ వేడుకలు ఆగస్టు 17న మధ్యాహ్నం 12 గంటలకు మాడిసన్ అవెన్యూలో నిర్వహించబడతాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఇండియా డే పరేడ్గా పేరుగాంచిన ఈ కార్యక్రమానికి దాదాపు ఆరు లక్షల మంది హాజరవుతారని అంచనా. పహాల్గాం ఉగ్రదాడి, అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు నివాళులతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు గర్వకారణమని విజయ్ దేవరకొండ తెలిపారు. అమెరికాలోని భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారితో కలిసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఎదురుచూస్తున్నానని చెప్పారు. సర్వే భవంతు సుఖినః అనే థీమ్తో జరిగే ఈ వేడుకలు 1981 నుండి నిరంతరం నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంలో భారతీయుల ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే ఈ పరేడ్లో విజయ్ దేవరకొండ పాల్గొనడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.










