Dhanush: జాతీయ అవార్డులపై ధనుష్ సంచలన కామెంట్స్.. ‘ఎవరూ అప్పుడు మాట్లాడలేదు’

Dhanush

Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా జాతీయ చలనచిత్ర అవార్డులు, మంచి సినిమాలకు లభించే గుర్తింపుపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన నటనకు ప్రశంసలు అందుకున్న ‘రాయన్’ సినిమా గురించి మాట్లాడిన ఆయన, ఆ చిత్రం కంటే ‘మేయళగన్’, ‘మహారాజా’ మరింత గొప్ప చిత్రాలని అభిప్రాయపడ్డారు.

అంతేకాదు, అవార్డుల అంశంపై కూడా ధనుష్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. గతంలో తాను నటించిన ‘పుదుపెట్టై’, ‘వడ చెన్నై’, ‘కర్ణన్’, ‘మర్యాన్’, అలాగే హిందీలో చేసిన ‘రాంఝణా’ వంటి చిత్రాలకు జాతీయ అవార్డులు రాకపోయినా, అప్పట్లో ఎవరూ పెద్దగా మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. మంచి సినిమాలకు లేదా గొప్ప నటనకు అవార్డు రాకపోవడం కొత్త విషయం కాదని, ప్రతి గొప్ప చిత్రానికీ అవార్డు దక్కాల్సిన అవసరం కూడా లేదనే భావనను ఆయన తన వ్యాఖ్యల ద్వారా వ్యక్తం చేసినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధనుష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవార్డులు అనేవి ఒక గుర్తింపు మాత్రమేనని, సినిమా విలువను ప్రేక్షకుల ఆదరణే నిర్ణయిస్తుందని ఆయన పరోక్షంగా చెప్పినట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ధనుష్ వ్యాఖ్యలపై సినీ అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.