Director Srikanth Odela: నాని ‘ది పారడైజ్’ అసలు స్టోరీ ఇదే.. కాళోజీ మాటలతో దర్శకుడు ఇచ్చిన గూస్‌బంప్స్ అప్‌డేట్!

Srikanth Odela

Director Srikanth Odela: నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’. ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమా స్టోరీపై విపరీతమైన చర్చ సాగుతోంది.

తాజాగా నిర్వహించిన చిత్ర ప్రెస్‌మీట్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. ఈ సినిమా స్టోరీ గురించి ఆసక్తికరమైన కథను చెప్పారు. ఆయన చెప్పిన పాయింట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. ఇది కేవలం సాధారణ సినిమా కాదని, ఒక విప్లవాత్మక ఎమోషనల్ ప్రయాణమని స్పష్టం చేశారు. “పారడైజ్ కథ ఏంటని చాలామంది అడుగుతున్నారు. ఇది ఒక తల్లి, కొడుకుల అనుబంధంతో సాగే ఎమోషనల్ డ్రామా. అలాగే ఒక ‘సవారి జాతి’ ఆక్రందన. ప్రజల పక్షాన నిలిచే ప్రజల సినిమా ఇది” అని చెప్పుకొచ్చారు. సినిమా అసలు కోర్‌ను వివరిస్తూ ప్రజాకవి కాళోజీ నారాయణరావు రాసిన చారిత్రక పంక్తులను శ్రీకాంత్ ప్రస్తావించారు. “‘పుట్టుక మనది.. చావు మనది.. కానీ బతుకంతా ఈ దేశానిది’ అని కాళోజీ గారు ఎప్పుడో చెప్పారు. ఈ దేశం కోసమే ప్రాణాలొడ్డి పోరాడిన వాళ్లనే, చివరికి ‘ఈ దేశంతో మీకు సంబంధం లేదు’ అని గెంటేయాలని చూస్తే.. ఆ నిస్సహాయత నుంచి తిరగబడ్డ ఒక జాతి కథే ఈ పారడైజ్” అంటూ సినిమాలోని అసలు పాయింట్‌ను బయటపెట్టారు.

డైరెక్టర్ నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క మాటతో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో స్పష్టమైంది. సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, పాటలు, పోస్టర్లు అన్నీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకున్నాయని, ఆలస్యమైనా ఇచ్చే ప్రతి కంటెంట్ బ్లాస్టింగ్ రేంజ్‌లోనే ఉంటుందని డైరెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కనిపించే వాతావరణం ‘తుఫాను ముందు ఉండే నిశ్శబ్దం’ మాత్రమేనని, రాబోయే రోజుల్లో వెండితెరపై అసలైన సునామీని చూపిస్తామని శ్రీకాంత్ ఓదెల ఇచ్చిన హామీ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.