
Allu Arjun: ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న ప్రముఖ సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ ప్రీ-రిలీజ్ స్క్రీనింగ్ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట కేసు విచారణ నాంపల్లి కోర్టులో కీలక దశకు చేరింది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన కేసులో నేడు నాంపల్లి కోర్టులో న్యాయవిచారణ జరిగింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేటి విచారణకు హాజరుకాకపోవడం గమనార్హం. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న మొత్తం 21 మంది నిందితులలో ఒక్క అల్లు అర్జున్ మినహా మిగిలిన వారందరూ ఈరోజు న్యాయస్థానం ముందు స్వయంగా హాజరయ్యారు.
బన్నీ కోర్టుకు రాకపోవడంతో ఆయన తరపు న్యాయవాది భాను చందర్ కోర్టులో ‘ఆబ్సెంట్ పిటిషన్’ దాఖలు చేశారు. అల్లు అర్జున్ ప్రస్తుతం ముంబైలో ఒక సినిమా షూటింగ్ షెడ్యూల్లో బిజీగా ఉన్నారని, వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల ఆయన నేరుగా కోర్టుకు రాలేకపోయారని న్యాయమూర్తికి వివరించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కోర్టుకు హాజరుకాకపోవడంపై స్పందించిన నాంపల్లి న్యాయస్థానం.. ఆయన రాకపోవడానికి గల స్పష్టమైన కారణాలను వివరిస్తూ తగిన ఆధారాలతో కూడిన మెమోను దాఖలు చేయాలని బన్నీ తరపు న్యాయవాదిని ఆదేశించింది.
అదే సమయంలో, షూటింగ్ల నేపథ్యంలో అల్లు అర్జున్ భవిష్యత్తులో వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ ఆయన లాయర్ చేసిన అభ్యర్థనపై కోర్టు తక్షణ నిర్ణయాన్ని తీసుకోలేదు. బన్నీకి వర్చువల్ హాజరు సదుపాయాన్ని కల్పించాలా లేదా అనే అంశాన్ని ప్రస్తుతానికి కోర్టు తన పరిధిలోనే ఉంచుకుంది. రెండు వైపులా వాదనలు విన్న అనంతరం, నాంపల్లి కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నెక్ట్స్ వాయిదా సమయంలోనైనా అల్లు అర్జున్ కోర్టుకు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.














