
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తన కెరీర్లో మరో కీలక దశకు సిద్ధమవుతున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు అల్లు అర్జున్తో తెరకెక్కించనున్న సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం లోకేష్ ఫస్ట్ ప్రియార్టిగా AA23 ప్రాజెక్ట్ మారిందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు రైటర్ రత్నకుమార్ వెల్లడించారు. నిజానికి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగా ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’, సూర్య పోషించిన రోలెక్స్ పాత్రతో ప్రత్యేక చిత్రం వంటి ప్రాజెక్టులు ఎప్పటి నుంచో చర్చలో ఉన్నాయి. అయితే అల్లు అర్జున్తో ఉన్న కమిట్మెంట్ కారణంగా ముందుగా AA23ను పూర్తి చేయాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
‘ఖైదీ 2’ విషయంలో వచ్చిన ఆలస్యంపై కూడా లోకేష్ గతంలో వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్తో చాలా కాలంగా సినిమా చేయాలనే ఆసక్తి ఉండటంతోనే ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని ఆయన తెలిపారు. అయితే LCUకు లోకేష్ పూర్తిగా దూరమయ్యారనే ప్రచారానికి మాత్రం ఆయన చెక్ పెట్టారు. LCU ముగిసిపోయిందన్న వార్తలను ఖండిస్తూ.. ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’, ‘రోలెక్స్’ వంటి సినిమాలు తన కమిట్మెంట్స్లో భాగమేనని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ సినిమా పూర్తయిన తర్వాత తిరిగి LCUపై పనిచేస్తానని వెల్లడించారు. అలాగే ‘బెంజ్’ కూడా LCUలో భాగంగానే కొనసాగుతుందని చెప్పారు. దీంతో ప్రస్తుతం LCU అభిమానుల ఎదురుచూపులు మరింత పెరిగాయి. ముందుగా AA23తో అల్లు అర్జున్ను లోకేష్ ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొనగా.. ఆ తర్వాత LCUలోకి ఆయన తిరిగి అడుగుపెట్టినప్పుడు ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’, ‘రోలెక్స్’ వంటి ప్రాజెక్టులపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అంటే.. LCUకి బ్రేక్ మాత్రమే తప్ప, ముగింపు కాదన్నమాట అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.














