చంద్రబాబుకు ఏఐసీసీ ఆహ్వానం

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏఐసీసీ ఆహ్వానం అందింది. మధ్యప్రదేష్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుదీరబోతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా అశోక్‌ గహ్లోత్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రెండు ప్రమాణస్వీకారోత్సవాలకి హాజరుకావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబుకి ఏఐసీసీ ఆహ్వానం పంపింది.

ఈ ఆహ్వానం మేరకు గహ్లోత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం చంద్రబాబు జైపూర్ నుంచి భోపాల్‌ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు కూడా వెళ్లనున్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ లతో పాటు.. కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, వివిధ పార్టీల నాయకులు అశోక్‌ గహ్లోత్‌, కమల్ నాథ్ ల ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.