ఏపీ వరద బాధితులకు అల్లు అర్జున్ సాయం

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు ఎన్నో వందల ఇళ్లు నేలమట్టం కాగా, వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే వందల మంది రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో వరదల కారణంగా రోడ్డున పడ్డ ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకు వచ్చింది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్‌ మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ తలా రూ. 25లక్షలు, గీతా ఆర్ట్స్‌ తరఫున నిర్మాత అల్లు అరవింద్‌ రూ. 10 లక్షలు ఏపీ సీఎం సహాయనిధికి విరాళంగా అందించగా..అల్లు అర్జున్ సైతం తన వంతు సాయంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్నే ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘ఇటీవల సంభవించిన వరదల వల్ల ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వారిని చూసి నా హృదయం తల్లడిల్లింది. వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూతగా నా వంతు రూ.25 లక్షలు విరాళంగా అందిస్తున్నాను’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.