తెలుగు చిత్రసీమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

తెలుగు చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. ఎవరొకరు ఏదొక కారణంతో కన్నుముతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు కన్నుమూశారు. శుక్రవారం సొంత ఊరు నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నాగేశ్వరరావు మరణం గురించి ఆయన కుమారుడు మాట్లాడుతూ ఫిట్స్ కారణంగా తన తండ్రి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు. నాగేశ్వర రావుకి కుమారుడు, కూతురు భార్య ఉన్నారు.

నాగేశ్వరరావు మృతదేహాన్ని వాళ్ళ అత్తగారి నివాసమైన కవులూరు గ్రామంలో ఉంచారు. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు నాగేశ్వరరావు కుమారుడు వెల్లడించారు. 1986 నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్న ఆయన స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అసిస్టెంట్ గా ఇండస్ట్రీలో కెరీర్ ను ప్రారంభించారు. ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగేశ్వరరావు ఆ తర్వాత శ్రీహరిని పరిచయం చేస్తూ ‘పోలీస్’ అనే సినిమా చేశారు. రెండు సినిమాలు మంచి హిట్ అవడంతో ఆ తర్వాత వరుసగా ‘శ్రీశైలం’, ‘సాంబయ్య’, ‘దేశద్రోహి’ వంటి సినిమాలను తెరకెక్కించారు.