వచ్చేది జగన్నాథ రథ చక్రాలు

ముందు నుండి అనుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాన్ గాలి గట్టిగా వీచింది. ఏపీ ప్రజలంతా జగన్ ను ముఖ్యమంత్రి గా చూడాలని అనుకున్నారు తమ నిర్ణయాన్ని ఓట్ ద్వారా తెలియజేసారు. ఎన్నికల లెక్కింపు మొదలైనప్పటి నుండి ఫ్యాన్ గాలి వీస్తూనే వచ్చింది. 128 స్థానాల్లో ఫ్యాన్ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది.

టీడీపీ 30 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉందంటే చంద్రబాబు ఫై ప్రజలు ఎంత వ్యతిరేకత చూపించారో అర్ధం అయ్యింది. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ జగన్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలను మొదలు పెట్టారు. ఇక ఈ నేపథ్యంలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

‘వస్తున్నాయ్… వస్తున్నాయ్‌ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్‌. కష్ట జీవులకు, కర్షక వీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, పొలాలనన్నీ హలాల దున్నీ హేమం పండించి… జగానికంతా సౌఖ్యం నింపేందుకు జగనన్న రథ చక్రాలు భూమార్గం పట్టాయి. కుహనా పార్టీ పునాదులు కూకటి వేళ్ళతో కదిలిపోతున్నాయి’ అంటూ శ్రీశ్రీ కవితను విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

‘చంద్రబాబు, కిరసనాయిలు, లగడపాటి చెబ్తున్న అర్థం లేని లాజిక్ లేమిటంటే సూర్యుడు తూర్పున ఉదయించాలని ఏమీ లేదన్నట్టుగా ఉంది. పీడ కలల్లో మునిగిన మీకు తెల్లారిన విషయం కూడా తెలియడం లేదు. మీ శకం ముగిసింది. నిజమైన ప్రజాస్వామ్యం చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభవించింది’ అని విజయసాయి మరో ట్వీట్ చేశారు.