బోరున ఏడ్చిన ఎమ్మెల్యే రాజయ్య ..


జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఈ మధ్య మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఆయనపై సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ఆమె నేరుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కే ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో రాజయ్య ఈ వివాదాన్ని ముగించేందుకు స్వయంగా సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. ప్రెస్ మీట్ లో పశ్చాతాపాన్ని ప్రకటించారు. క్షమాపణలు కోరారు. గ్రామ అభివృద్ధికి 25 లక్షలు నిధులు ప్రకటించారు. అయినా సరే సర్పంచ్ నవ్యలో కోపం చల్లారలేదు. ప్రెస్ మీట్ లోనే ఎమ్మెల్యేను కడిగేశారు. మరోసారి తన జోలికి వస్తే దారుణ పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఘాటుగానే హెచ్చరించారు.

ఆ తర్వాత రాజయ్య నవ్య ఇష్యూపై మాట్లాడలేదు. తాజాగా కరుణాపురంలో జరిగిన ఫాదర్ కొలంబో జయంతి వేడుకల్లో రాజయ్య పాల్గొన్నారు. ఈ వేడుకలో తన బాధను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. కొందరు రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని అంటూ కంటతడిపెట్టారు. 63 ఏళ్ల వయసున్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. దమ్ముంటే ఫేస్‌ టూ ఫేస్‌ రాజకీయాలు చేయాలని.. తాడోపేడో తెలుసుకుందామని రాజయ్య సవాల్ విసిరారు. ఏ సర్వే చూసినా తాను ముందు వరుసలో ఉన్నానని అందుకే కుట్రతో కొందరు ఇబ్బంది పెడుతున్నారని బోరున విలపించారు. ఎవరరెన్ని ఇబ్బందులు పెట్టిన ఫాదర్ కొలంబో ఆశిస్సులతో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు.