కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అప్రమత్తం


దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. కేసులు అధికంగా నమోదవుతున్న గుజరాత్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు లేఖ రాసింది. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని.. ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖల్లో సూచించారు. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టెస్ట్ ట్రాక్, ట్రీట్.. వ్యాక్సినేషన్ వ్యూహాన్ని అనుసరించాలని కేంద్రం కోరింది.

దాదాపు నాలుగు నెలల తర్వాత 24 గంటల సమయంలో దేశంలో 754 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్ లో 734 కోవిడ్ కేసులు నమోదు కాగా ఆ తరువాత ఆ స్థాయిలో నమోదవడం ఇదే ప్రధమం. కరోనా కారణంగా తాజాగా కర్ణాటకలో ఒకరు మరణించినట్లు నిర్ధారించారు. కోవిడ్ సమయంలో గుర్తించిన లక్షణాలే ఇప్పుడు ఇన్ఫెక్షన్‌లు గానూ వస్తున్నట్లు గుర్తించారు. గొంతు నొప్పి, జ్వరం, అలసట వంటి లక్షణాలనే ఇన్‌ఫ్లుయెంజాతో వైరస్ బాధితుల్లోనూ కనిపిస్తున్నాయి. దీంతో..కోవిడ్ తో పాటుగా వైరస్ ఇన్ఫెక్షన్‌ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

ప్రస్తుతం దేశంలో 4,633 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో లో ఇప్పటివరకు నమోదైన కొవిడ్​ కేసుల సంఖ్య 4,46,92,710కు చేరింది. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297కి చేరింది. దేశవ్యాప్తంగా 220.64 కోట్ల వాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.