చేప ప్ర‌సాదం పంపిణీకి ముహుర్తం ఖరారు !


ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు బ‌త్తిన సోద‌రులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ గ‌త మూడేండ్లుగా నిలిచిపోయింది. మళ్ళీ ఈ ఏడాది నుంచి చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈరోజు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో రాష్ట్ర ప‌శు సంవ‌ర్ధ‌క‌, మ‌త్స్య శాఖ‌ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ను కలిసిన బత్తిన సోదరులు, జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ చేయడానికి ముహూర్తం ఖరారు చేసారు.

ఇకపోతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. కాగా ఆస్తమా రోగులకు విశేష ఔషదంగా ఈ చేప ప్రసాదం పనిచేస్తుందని ప్రజల్లో బలమైన నమ్మకం వుంది. దీంతో చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉబ్బసం వ్యాధి గ్రస్తులు హైదరాబాద్‌కు వస్తుంటారు. అయితే దాదాపు మూడేళ్ళ తర్వాత చేప ప్రసాదం పంపిణీ చేస్తుండ‌టంతో ఈ సారి జనం భారీగా తరలి వ‌చ్చే అవ‌కాశం ఉండడంతో దానికి తగ్గట్లుగా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని యాదవ్ తెలిపారు.