యువతిపై జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ మాజీ ఛైర్మన్‌ లైంగిక దాడి


హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పరిధిలో ఇంట్లో పని చేసే యువతిపై ఇంటి యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె బాత్రూంలో స్నానం చేస్తుండగా.. సీక్రెట్‌గా ఫోటోలు, వీడియోలు తీసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తల్లి సాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో పనిచేసే యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ప్రైవేట్ స్కూల్‌ మాజీ ఛైర్మన్‌, అతని కుమారుడిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి (22) ఇంటి పని చేసేందుకు ఓ ఏజెన్సీలో పేరు నమోదు చేసుకుంది. సదరు ఏజెన్సీ జూన్‌ 18న ఆమెను బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12 మిథులానగర్‌లో నివాసముండే జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ మాజీ చైర్మన్‌ మురళీ ముకుంద్‌ ఇంట్లో పనికి పంపించారు. అయితే యువతిపై మురళీ ముకుంద్ కన్నేశాడు. జులై 16న ఆ యువతికి తన బెడ్రూంలో బెడ్‌షీట్‌ మడత పెట్టాలని లోపలికి పంపించాడు. అనంతరం అతను లోపలికి వెళ్లి తలుపు గడియపెట్టాడు. ఆమె భయంతో చూస్తుండగా.. స్నానం చేసిన రావాలని ఆ యువతిని బెదిరించాడు. స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు, ఫోటోలు తీశాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

జరిగిన విషయం ఎవరికైనా చెబితే నీ తల్లితో కలిసి చంపేస్తానని ఆ యువతిని బెదిరించాడు. రెండు రోజుల తర్వాత బాధితురాలు తన కుమారుడు ఆకాష్‌తో ఈ విషయాన్ని చెప్పడంతో.. అతడు బాధితురాలిని తీవ్రంగా కొట్టి బెదిరించాడు. ఆ తర్వాత కూడా ఆమెపై పలుమార్లు లైంగిక దాడి జరగడంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లి సాయంతో ఈనెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించి మురళీ ముకుంద్‌, అతని కుమారుడు ఆకాష్‌పై కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు