సమైక్యాంధ్రపై తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబుకు కనువిప్పు కలిగిస్తానంటూ కృష్ణా జిల్లాలో బాబు పాదయాత్ర ప్రవేశించినప్పుడు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సృష్టించిన హైడ్రామా గుర్తుండే ఉంటుంది. ఈరోజు దానికి కొనసాగింపు మొదలయింది. నిన్నటి రోజు సాయంత్రం బాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. స్థానబలమనుకున్నంటున్నారు లగడపాటి వారు. ఏదేమైనా ఈరోజు బాబుకు కనువిప్పు కలిగించేస్తానంటూ ర్యాలీమొదలెట్టేశాడు. అయితే బుడమేరు వంతెన వద్ద ఎంపీ లగడపాటి రాజగోపాల్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అధికార కార్యక్రమాలకు వెళుతుంటే అడ్డుకోవడం ఏంటనీ లగడపాటి నిలదీశారు. ఈనెల 9న చంద్రబాబును కలుస్తానని లగడపాటి తెలిపారు. లగడపాటిని అడ్డుకున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు చర్యగా చంద్రబాబు శిబిరం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడికి వినతిపత్రం ఇచ్చేందుకు బయల్దేరిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి విద్యార్థులతో ర్యాలీగా బయల్దేరిన లగడపాటిని బడమేరు వంతెన వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల ర్యాలీలో ఆ ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.