తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా


తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16 న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 23, నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27 చివరి తేదీ. ఇక మార్చి 13 న పోలింగ్ జరగనుంది.. 16 న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

తెలంగాణాలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏపీలోని ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనితో పాటు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ స్థానాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి.