నేతలకు సోనియా గీతోపదేశం!

sonia chiontan shivirజైపూర్ లో కాంగ్రెస్ మేథోమథన సదస్సు ప్రారంభమైంది. 2014 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న సదస్సులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ… అధికార పక్షంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజల ఆశలు, ఆశయాలు వమ్ముచేయరాదని పేర్కొన్నారు. దానికోసం పార్టీ నాయకులంతా టీమ్ లాగ పనిచేసి సవాళ్లను ఎదుర్కోవాలని సూచించారు. ప్రతిఏటా కోటి మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని దానికి అనుగుణంగా ఆయా రంగాల్లో ఆర్థికాభివృద్ధి సాధించాలనేదే రాజకీయ ఉద్దేశం అని తెలిపారు. దేశంలో సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఎంత అభివృద్ధి చేస్తున్నా కొన్ని రాష్ట్రాల నుంచి తమకు రాజకీయ మద్దతు లభించడం లేదని వాపోయారు.

మరోవైపు దేశంలో నేరాలు కూడా పెరుగుతున్నాయని, మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో తామంతా సిగ్గుపడాలన్నారు. భూమి, నీటి కోసం జరుగుతున్న ఉద్యమాలను తక్కువ చేసి చూడకూడదని సోనియా ఉద్భోదించారు. బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్నామని, ఇంకా ఎంతో అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఉందని కేవలం అధికారం చేజిక్కించుకోవడం ప్రధాన అజెండా కారాదని సోనియా తెలిపారు. మిత్రపక్షాలు, విధానాల మధ్య సమతుల్యం సాధించాలన్నారు.

కాగా ఈ సదస్సులో నేతలు 5అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. వీటిలో రాజకీయ సవాళ్లపై జరిగే చర్చకు ఎ.కె. అంటోని, సామాజిక, ఆర్థిక సవాళ్లపై జరిగే చర్చకు దిగ్విజయ్ సింగ్, మహిళా సాధికారితపై జరిగే చర్చకు గిరిజావ్యాన్, పార్టీ సంస్థాగత సమస్యలపై జరిగే చర్చకు గులాంనబీ అజాద్, భారత్-ప్రపంచ పరిణామాలపై జరిగే చర్చకు ఆనంద్ శర్మలు నేతృత్వం వహిస్తారు.