Tirupati : క‌ల్కి అలంకారంలో శ్రీ క‌ల్యాణ‌ వేంకటేశ్వరస్వామి


శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ‌ వేంకటేశ్వర‌స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంట‌ల‌కు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని.. నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.

ఇక వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ వెంక‌ట‌స్వామి, ఆల‌య అర్చకులు బాలాజి రంగ‌చార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.