భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే కి సిద్దమవుతున్న విశాఖ


భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ ఈనెల 19న విశాఖ లోని వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మ్యాచ్‌ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభమవుతుందని ఏసీఏ ప్రతినిధులు తెలిపారు. స్టేడియం మొత్తం కెపాసిటీ 28,000 కాగా ఈ నెల పదో తేదీ నుంచి 70% టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి ఉంచనున్నారు… మిగతా 30% టికెట్లను ఆఫ్లైన్లో 13వ తేదీ నుంచి మూడు ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించనున్నారు.. మ్యాచ్‌కు రెండు గంటల ముందు నుంచే ఎంట్రీ గేట్లన్నీ తీసి ఉంటాయన్నారు. ఈ సారి టికెట్లపై బార్‌కోడ్‌ ఉండడంతో ప్రేక్షకులు స్టేడియం లోపలికి వేగంగా వెళ్లే అవకాశం ఉందన్నారు. నాలుగేళ్ల విరామం తరువాత స్టేడియంలో వన్డే మ్యాచ్‌ జరుగుతుండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సుమారు 1500 మంది పోలీసులతో విధులు నిర్వహించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.