స్టార్ కాస్ట్ : మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని తదితరులు..
దర్శకత్వం : మహి వి రాఘవ్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
మ్యూజిక్ : కె ( క్రిష్ణ కుమార్ )
విడుదల తేది : ఫిబ్రవరి 08, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5
రివ్యూ : యాత్ర – రాజన్నను మళ్లీ గుర్తుచేసింది..
2019 సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత మళ్లీ యాత్ర తో బాక్స్ ఆఫీస్ సందడి గా మారింది. దివంగత నేత వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈరోజు ( ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.. వైఎస్ఆర్ పాత్రలో నటించడంతో ఈ చిత్రానికి హైప్ వచ్చింది.
70 యమ్.యమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో 3వ చిత్రంగా ‘యాత్ర’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ ప్రకటన చేసిన దగ్గరనుండి వైఎస్.ఆర్ అభిమానుల్లోనే కాక సాధారణ ప్రజల్లో కూడా ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు భారీ ప్లాప్ కావడం తో ఇప్పుడు ఈ బయోపిక్ ను ఎలా తీస్తారు..? అది ఎలా ఉండబోతుంది..? ప్రస్తుతం అధికార పార్టీ లో ఉన్న తెలుగు దేశం పార్టీ ఫై ఈ బయోపిక్ ప్రభావం ఉంటుందా..? ఉండదా..? లేక ఎన్నికల స్టంటా.. జగన్కి సపోర్ట్గా తీస్తున్నారా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో నెలకొని ఉన్నాయి. మరి వారి ప్రశ్నలకు మహి ఎలాంటి సమాధానం చెప్పారో..చూపించారో ఇప్పుడు చూద్దాం.
కథ :
“నీళ్ళుంటే కరెంటు వుండదు.. కరెంటు వుంటే నీళ్ళుండవు..రెండూ ఉండి పంట చేతికొస్తే సరైన ధర వుండదు. అందరూ రైతే రాజంటారు..సరైన కూడు గూడు గుడ్డ నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్య.. మమ్మల్ని రాజులుగా కాదు కనీసం రైతులుగా బ్రతకనివ్వండి చాలు.. అని ప్రతి రైతు గొంతెత్తి అరుస్తున్న సమయం అది.. ఎవరైనా ఆదుకుంటారా అని రైతన్న ఎదురుచూసిన సమయంలో ఒక గొంతుక వినిపించింది.. “నేను విన్నాను నేను వున్నాను అంటూ ఓ పిలుపు పేద ప్రజలవైవు నిలుచుంది. నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాము. కాని… జనానికి ఏం కావాలో తెలుసుకొలేకపోయాము అంటూ అదిష్టానాన్ని సైతం లెక్కచేయక పేద ప్రజల కష్టాల్ని వినటానికి కడప గడప దాటి ప్రజాయాత్ర ని పాదయాత్రగా ప్రారంభించిన జననేతగా , మహనేతగా పేద ప్రజల గుండె చప్పుడుగా ఎప్పటికి పదిలమైన చోటు సుస్థిరపరుచుకున్న మహానాయకుడు వైఎస్ పాదయాత్ర ను సినిమాగా చూపించారు.
సినిమా మొత్తం కూడా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పైనే సాగుతుంది. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి, ఆయన ముఖ్యమంత్రి కావడానికి పాదయాత్ర ఎలా దోహదపడింది. ఆ పాదయాత్రలో భాగంగా రాజన్నకు ఎదురైన అనుభవాలు, ఆయనకు ప్రజలు ఏ విధంగా నీరాజనం పట్టారు..ప్రజల కష్టాలను పాదయాత్ర ద్వారా ఎలా తెలుసుకున్నాడు..వంటి అంశాలే సినిమా కథ.
ప్లస్ :
* చిత్ర నిడివి
* వై.ఎస్. పాత్రలో మమ్ముట్టి నటన
* నేపధ్య సంగీతం
* డైరెక్షన్
మైనస్ :
* ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా సాగడం
నటీనటుల పెర్పామెన్స్ :
* వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్ర లో మమ్ముట్టి అద్భుతంగా చేసారు.. ఆ పాత్రలో రాజన్న తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. రాజశేఖర్ రెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. ఆరోగ్య శ్రీ పథకం పురుడు పోసుకోవడానికి దర్శకుడు రాసిన హాస్పటల్ సీన్లో ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. 15 నిమిషాలు పాటు సాగిన ఆ సీన్లో కళ్లు చెమర్చని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తికాదు. అంతలా హార్ట్ టచ్చింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు మమ్ముట్టి. ఇలా ఇదెక్కటే కాదు చాల సన్నివేశాల్లో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు.
* Y. S. రాజా రెడ్డి పాత్ర లో జగపతి బాబు కరెక్ట్ గా సెట్ అయ్యాడని , ఆయన నటన కూడా బాగుంది.
* Y. S. జగన్మోహన్ రెడ్డి గా సుధీర్ బాబు , సబితా ఇంద్ర రెడ్డి గా సుహాసిని , కేవీపీ రోల్ లో రావు రమేష్ , రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ రోల్ లో ఆశ్రిత వేముగంటి చక్కగా చేసారు.
* అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి మొదలగు వారు వారి వారి పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం :
* కె ( క్రిష్ణ కుమార్ ) మ్యూజిక్ ఆకట్టుకుంది..పాదయాత్ర చుట్టూ సాగే కథకు చక్కటి నేపధ్య సంగీతం అందించి సక్సెస్ అయ్యాడు.
* శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా సాగినట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చాల ఆసక్తిగా స్పీడ్ చేసాడు.
* సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం ఆకట్టుకుంది.
* విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి.
* ఇక డైరెక్టర్ మహి విషయానికి వస్తే…ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మహి వి రాఘవ్ ఈ సినిమాకు డైరెక్ట్ చేస్తున్నాడనే వార్త మొదటగా అందరిలో ఖంగారు పెట్టించిన ఆ తర్వాత సినిమాకు సంబందించిన వివరాలు బయటకొస్తూ , ట్రైలర్స్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ అందరిలో ఖంగారును తగ్గించాయి..
ఆయన ఏం చెప్పదల్చుకున్నాడో సుత్తి లేకుండా చెప్పి సక్సెస్ అయ్యాడు. సినిమా మొదలైనప్పటి నుండే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. ప్రతీ ప్రేక్షకుణ్ని పాదయాత్రలో భాగం చేశాడు. అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు.
మమ్ముట్టి లో రాజశేఖర్ కనిపించేలా ఆయన్ను తీర్చి దిద్దాడు..డైలాగ్స్ , నడక , చూపు ఇలా అన్నిటి ఫై శ్రద్ద పెట్టాడు. కొన్ని చోట్ల తెలుగుదేశం అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫై సెటైర్లు వేయడం, ఓటుకు నోటు కేసులోని ఆడియో టేపుని చూపించడం చేసారు. వైఎస్ జగన్కి సంబంధించిన ప్రజా సంకల్పయాత్ర ఒరిజినల్ వీడియోలను ఈ చిత్రంలో చూపించారు.
ఫైనల్ :
‘యాత్ర’ సినిమా ఓ ఎమోషనల్ జర్నీ. ఇందులో చెప్పుకునే కథ ఉండదు. కేవలం పాత్రలే కథకు ప్రాణం పోస్తాయి. రాజన్న పాత్రలో మమ్ముట్టి ప్రాణం పెట్టడం..ఆ పాత్రకే హైలైట్ అయ్యింది. ప్రేమ, కరుణ, దయ, పొగరు, లాంటి ఎమోషన్స్ పలికించడమే కాకుండా కొన్ని ఎమోషన్ సీన్లలో కళ్లతో నిర్ణయం చేయడం ఎలాగో చూపించారు.
ఫస్టాఫ్ కాస్త స్లో గా నడిపించిన దర్శకుడు సెకండాఫ్లో బలమైన సీన్లను రాసుకున్నారు. ముఖ్యంగా వైఎస్ ప్రవేశ పెట్టిన ఒక్కో సంక్షేమ పథకానికి ఒక్కో బలమైన కారణాన్ని చాలా ఎమోషనల్ చూపించి సక్సెస్ అయ్యాడు. పాత్రల ఎంపికలో కూడా సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా యాత్ర రాజన్న ను మరోసారి గుర్తుచేసింది.
నోట్ :
సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5