
Manoj Muntashir: పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమా అప్పట్లో ఎంతటి వివాదాలకు కేంద్రబిందువైందో తెలిసిందే. ముఖ్యంగా సినిమా డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, పురాణ ఇతిహాసాన్ని చూపించిన విధానంపై మేకర్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంభాషణలు అందించిన రచయిత మనోజ్ ముంతషీర్ చేసిన కామెంట్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. .. ‘ఆదిపురుష్’ నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఆ సినిమా విడుదలైన తర్వాత దాన్ని సమర్థించడం అంతకంటే పెద్ద తప్పు” అని అన్నారు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.
సినిమా చుట్టూ జరిగిన ప్రతి పరిణామం గురించి తనకు ఎంతో సిగ్గుగా అనిపిస్తోందని ఆయన వెల్లడించారు. “ఆ సినిమా వల్ల ప్రజలు బాధపడి ఉంటే, ఈ దేశ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను” అంటూ మనోజ్ ముంతషీర్ భావోద్వేగంగా స్పందించారు. 2023లో విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినప్పటికీ, స్టోరీ, విజువల్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా అనేక వివాదాలు తలెత్తగా, చిత్రబృందం కొన్ని డైలాగ్స్ను సవరించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. తాజాగా మనోజ్ ముంతషీర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ తన నిర్ణయాన్ని సమర్థించిన ఆయన, ఇప్పుడు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.













