
Gopichand Malineni: నందమూరి బాలకృష్ణ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెంగళూరు సమీపంలోని హాస్కోటే పరిధిలోని కంబాలిపుర కాటేరమ్మ దేవాలయంలో ఆయన ఆధ్వర్యంలో మహా హోమం, ప్రత్యేక యాగం నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో వేద పండితులు పాల్గొని బాలయ్య సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘NBK111’ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇటీవల కాకినాడ పోర్టు సమీపంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిందే.
ప్రమాదం జరిగిన వెంటనే చిత్రబృందం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. అవసరమైన సర్జరీ కూడా విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం బాలకృష్ణ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన హీరో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యేక పూజలు నిర్వహించడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ఈ విషయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు కూడా బాలయ్య త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి షూటింగ్లో పాల్గొనాలని ప్రార్థిస్తున్నారు. ఇక #NBK111 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ కోలుకున్న వెంటనే మిగిలిన షూటింగ్ను పూర్తి చేసి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Prayed for the well being and speedy recovery of #NandamuriBalakrishna garu at Kateramma Temple, near Bangalore…🙏🏻🙏🏻🙏🏻 Can't wait to see him roar back on the sets of #NBK111. pic.twitter.com/Nt2ApDMFUq
— Gopichandh Malineni (@megopichand) July 26, 2026













