
Mohanlal: మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి ఆయన తాజాగా ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. ఏకంగా ఏడుగురు ప్రముఖ దర్శకులతో సినిమాలు చేయనున్నట్లు ప్రకటించడంతో మలయాళ సినీ పరిశ్రమలో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. మోహన్లాల్ తదుపరి లైనప్లో విష్ణు మోహన్, అనూప్ సత్యన్, ప్రియదర్శన్, దిలీష్ పోతన్, సత్యన్ అంతికాడ్, జూడ్ ఆంథనీ జోసెఫ్, జీతూ జోసెఫ్ వంటి దర్శకులు ఉన్నారు. విభిన్న జానర్లు, భిన్నమైన కథాంశాలతో ఈ సినిమాలు తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది.
ఇక అనూప్ సత్యన్ దర్శకత్వంలో మోహన్లాల్ నటించబోయే చిత్రం ప్రత్యేకంగా నిలవనుంది. ఈ సినిమాను క్విర్కీ కామెడీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించనున్నట్లు సమాచారం. బిను జార్జ్ అలెగ్జాండర్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ నవంబర్లో ప్రారంభం కానుంది. కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అజిత్ కుమార్తో మోహన్లాల్ చేయనున్నారని ప్రచారం జరిగిన ‘డేర్డెవిల్’ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారనే వార్తలు ఇటీవల వినిపించాయి. బడ్జెట్కు సంబంధించిన కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన వైదొలిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పూర్తి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మోహన్లాల్ తన కొత్త లైనప్ను ప్రకటించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. 2027 వరకు ఆయన చేతిలో వరుస ప్రాజెక్టులు ఉండటంతో పాటు.. ప్రతి సినిమా విభిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. స్టార్ హీరోగా భారీ సినిమాలతో పాటు కొత్త తరహా కథలకు ప్రాధాన్యం ఇస్తుండటంపై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.














