
HHVM : పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పవన్ పాత్రను రూపొందించడానికి తాను దివంగత సినీ దిగ్గజాలు ఎన్టీఆర్, ఎంజీఆర్ల నటనా ప్రదర్శనల నుంచే ప్రేరణ పొందానని చెప్పారు.
పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ధర్మపరుడు, బలవంతుడు, ప్రజల మనిషి అనే కోణాలను దృష్టిలో పెట్టుకొని ఆయన పాత్రను తీర్చిదిద్దాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంజీఆర్ గారు చేసిన సందేశాత్మక చిత్రాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. అందుకే ‘మాట వినాలి’ అనే సందేశాత్మక గీతాన్ని రూపొందించాం. ఇది పవన్ గారి భావజాలాన్ని ప్రతిబింబిస్తుంది అని ఆయన వివరించారు.
అలాగే ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్లో రాముడు, కృష్ణుడిగా చూపిన అద్భుత నటన తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. ఎన్టీఆర్ గారి శ్రీరాముడి పాత్రలోని విల్లు, బాణం నుంచి నేను స్ఫూర్తి పొందాను. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ పాత్రలోనూ ధర్మాన్ని సూచించే ఆయుధాలుగా విల్లు, బాణాన్ని ఉపయోగించామన్నారు. పవన్ కళ్యాణ్ను ప్రేక్షకులు హీరోగా కాకుండా ఒక నాయకుడిగా చూస్తున్నారు. అందుకే ప్రతి సన్నివేశాన్ని ఆ లోతుతో రాశాను అని జ్యోతికృష్ణ స్పష్టం చేశారు.












