
2025 ఏప్రిల్ 22న బైసరన్ లోయ, పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు దుర్మరణం పాలై, 20 మందికి పైగా గాయపడిన ఘటనపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని మరియు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ దాడిని యావత్ దేశం ఖండించినట్లు, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతును తెలుపుతున్నట్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్పష్టం చేసింది. దోషులను వెంటనే శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి దాడులు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పించడానికి, బాధిత కుటుంబాలకు తమ మద్దతును తెలియజేయడానికి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున 2025 ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్ ఫిలిం నగర్లోని రామానాయుడు కళామండపం నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉగ్రవాద నిర్మూలన ప్రయత్నాలకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరోసారి స్పష్టం చేసింది.









