రోడ్లపై చెత్తవేస్తే భారీ జరిమానా, ప్రభుత్వం ఆదేశాలు !

నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను సహించేదిలేదని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ హెచ్చరించారు. నేడు జిహెచ్ఎంసి కార్యాలయంలో జోనల్, డిప్యూటి కమిషనర్లు, ఏ.ఎం.హెచ్.ఓ ల సమావేశంలో ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. మరికొద్ది రోజుల్లో వర్షాలు ఆరంభమవుతున్న దృష్ట్యా రహదారులపై పూర్తిస్థాయిలో గార్బేజ్ ను ప్రతిరోజు తొలగించడం ద్వారా అటువ్యాధులు, కరోనా వ్యాప్తిని నివారించాలని ముఖ్య కార్యదర్శి తెలిపారు. నేడు ఉదయం నగరంలో చేపట్టిన విస్తృత పారిశుధ్య కార్యక్రమం, శానిటైజేషన్ లపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు సమీక్ష సమావేశం నిర్వహించారని అర్వింద్ కుమార్ తెలిపారు. తమ సర్కిల్ పరిధిలోని ఇ.ఇ, డి.ఇ, ఏ.ఎం.హెచ్.ఓ, ఏ.ఎం.సి, ఏ.సి.పి లకు నిర్థారిత పరిధిని నిర్ణయించి ఆ పరిధిలో వంద శాతం పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను ఉంచాలని సూచించారు.

నగరంలో గార్బేజ్ తొలగింపు అనేది ప్రాథమిక విధి అని, వీటిని పూర్తిస్థాయిలో తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలలోపే క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించాలని డిప్యూటి కమిషనర్లు, ఏ.ఎం.హెచ్.ఓ లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించని అధికారులపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై నిర్లక్ష్యం వహించడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమేనని అన్నారు. నగరంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ బాధ్యతారహితంగా రహదారులపై చెత్తవేసేవారిని గుర్తించి జరిమానా విధించాలని పేర్కొన్నారు.