పెళ్ళై 20 రోజులు గడవకముందే నవ దంపతుల మరణం

ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకొని..వందేళ్లు పిల్ల పాపలతో సంతోషంగా గడపాలని అనుకున్న నవ దంపతులు..ఆ ముచ్చట తీరకుండానే కన్నుమూశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఎన్‌ఆర్‌ఐ ఉద్యోగులు మృతి చెందారు.

అనంతపురానికి చెందిన విష్ణువర్దన్‌(28), కడపకు చెందిన కుల్వ కీర్తి(25) అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. గత జూన్‌ 19న వీరికి పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. రెండు రోజుల కిందట బెంగళూరులోని బంధువుల ఇంటికి వెళ్లి నవ దంపతులు బుధవారం కారులో అనంతపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. బొమ్మేపర్తి గ్రామ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన లో తీవ్రంగా గాయపడిన కీర్తి అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోనూ, విష్ణువర్దన్‌ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వీరిద్దరి మరణంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.