యూపీలో మహిళ ఆత్మహత్య చేసుకున్న గంటల్లోనే.. అత్తింట దారుణం…


ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో అన్షిక అనే మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తమ కూతుర్ని అత్తింటి వారే హత్య చేసారని ఆరోపిస్తూ మఈతురాలి కుటుంబసభ్యులు ఆమె అత్తింటికి నిప్పంటించారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం సంచలనం కలిగిస్తోంది.

అన్షిక అనే మహిళకు 27 సంవత్సరాల యువకుడితో గతేడాది వివాహమైంది. పెళ్లైన దగ్గర్నుండి ఆమెను అత్తింటి వారు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలిసిన అన్షిక పేరెంట్స్ ఆమె అత్తింటికి వచ్చి గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య గొడవ ముదిరి అన్షిక బంధువులు ఆమె అత్తింటికి నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఐదుగురిని రక్షించారు. మంటలు ఆర్పిన తర్వాత రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఒకరు అన్షిక అత్త శోభాదేవి.. మరొకరు ఆమె బావ రాజేంద్రగా పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు అన్షికను అదనపు కట్నం కోసం వేధించి అత్తింటి వారే ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రించారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మొత్తం ఈ ఘటనపై ప్రయాగ్ రాజ్ సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపక్ భుకర్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.