నయా ట్రెండ్ : ఆన్లైన్ లో విషం తెప్పించుకొని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

అమెజాన్ లో కరివేపాకు పొడి పేరుతో గంజాయి వస్తున్న విషయంపై ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ విషయమై కేసులు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా అమెజాన్ లో ఆత్మహత్యలకు విషం కూడా వస్తుందని మరో కేసు నమోదైంది. ఇండోర్ లో రంజిత్ వర్మ అనే వ్యక్తి తన కొడుకు ఆదిత్య అమెజాన్ లో విషం తెప్పించుకుని దాన్ని తాగి చనిపోయాడని కేసు పెట్టారు. లోదీ కాలనీకి చెందిన ఆదిత్య ఈ విషయమై పోలీసులకు చేసిన ఫిర్యాదులో అమెజాన్ లో సెల్ఫాస్ అనే మందు దొరుకుతోందని దీన్ని ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా తెప్పించుకుని తన కొడుకు చనిపోయాడని చెప్పారు.

18ఏళ్ల వయసున్న తన కొడుక్కి ఈ మందు అమ్మకూడదని, రంజిత్ పేర్కొన్నాడు. ఈ సెల్ఫాస్ అనే మందు కెమిస్ట్ లకు కూడా సాధారణంగా దొరకదని, అయితే అమెజాన్ ఈ కామర్స్ ద్వారానే ఈ మందు తన కొడుక్కి అందిందని అందువల్ల ఈ ఆత్మహత్యకు అమెజాన్ ఈ కామర్స్ వారిని కూడా బాధ్యులుగా చేయాలంటూ రంజిత్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కి కూడా ఒక వినతిపత్రం సమర్పించారు. కరివేపాకు పొడి పేరుతో గంజాయి, ఆత్మహత్యలు చేసుకునేందుకు విషం.. ఇలా ఆన్ లైన్ లో దొరుకుతుంటే యువకులు చెడిపోతారని, ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు లాగా ఇంకెవరూ ఇలా ఆన్ లైన్ లో విషం తెప్పించుకోకూడదని తాను పోరాటం చేస్తున్నానని అన్నారు.