సూరిగాడు, నాన్నగారు, పరువు ప్రతిష్ట, అమ్మోరు, పట్టుకోండి చూద్దాం, దొంగాట…. ఇలా హిట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకొన్నాడు సురేష్. అయితే ఆ తరవాత హీరోగా అవకాశాల్లేక, సహాయ నటుడు పాత్రలకు షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యాడు. ఈరోజు (మంగళవారం) సురేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో కొన్ని సంచలనాత్మక స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ”నేను తెలుగువాణ్ణి. ఇక్కడే నా కెరీర్ ప్రారంభమైంది. నేనిక్కడే ఉంటా. తెలుగు చక్కగా మాట్లాడతా. అందుకనేనేమో తెలుగులో నాకు అవకాశాలు రావడం లేదు. అదే ఏ ముంబైలోనో ఉంటే, ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి మరీ హైదరాబాద్ తీసుకొద్దురు..” అని ఆవేదన వ్యక్తం చేశాడు. “మణిరత్నం సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. బొంబాయిలో ముందు నన్నే అడిగారు. కాకపోతే అప్పట్లో డేట్స్ కుదర్లేదు. అందుకే.. ఆ సినిమాని వదులుకొన్నా. దళపతి, ఘర్షణ చిత్రాల్లోనూ ఛాన్స్ వచ్చింది. కానీ చేయలేకపోయా. ఆ గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ ఉంది“ అని చెప్పుకొచ్చాడు సురేష్.