అఖిల్ అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో అఖిల్ మాట్లాడుతూ.. ”ఈమధ్య ఓ విషయం తెలుసుకున్నాను. రెడ్డి అనే ఓ అభిమాని మరో ఇద్దరితో కలిసి విజయవాడ నుంచి తిరుపతి 450 కిలో మీటర్లు కాలినడకన వెళ్లారట. ఈ విషయం తెలుసుకున్న వెంటనే నా కంట్లోంచి నీళ్లొచ్చాయి. ఇదంతా అవసరం లేదు. మీ అభిమానం మాతో ఉంది. అది చాలు. ఇలాంటి సాహసాలు చేయకండి. మీ కుటుంబ సభ్యులు మీపై చాలా ఆశలు పెట్టుకుంటారు. వాళ్లంతా బాధపడుతుంటారు. ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చేయకండి” అని అభిమానుల్ని కోరాడు అఖిల్.
ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తనని ప్రేమగా టైగర్ అని పిలుస్తానని, తారక్ గారూ… అంటే తట్టుకోలేడు. ఏట్రా బలిసిందా.. ఫార్మల్గా అయిపోతున్నావు అని అడుగుతాడు. కలిసిన నిమిషంలో కుటుంబ సభ్యుడిలా చూసేసుకుంటాడు” అంటూ ఎన్టీఆర్ గురించి చెప్పాడు అఖిల్.