ఎట్టకేలకు స్వదేశానికి కోహ్లీ.. అనుష్క

భారత్‌ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎట్టకేలకు తిరిగి స్వదేశాగమనం జరిగింది. ఈరకోజు కోహ్లీ.. అతని భార్య అనుష్క శర్మ ముంబై విమానాశ్రయం చేరుకున్నారు. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన టీమిండియా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ వెంటనే టికెట్లు ఏర్పాటు చేయకపోవడంతో భారత ఆటగాళ్లు కొన్ని రోజులు ఇంగ్లాండ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ రోహిత్‌ శర్మ అందరికంటే ముందుగానే స్వదేశానికి రావడం విశేషం.

కాగా వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా టీమిండియాను ముంబైలో రేపు ఎంపిక చేయనున్నారు. మొదట వెస్టిండీస్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లుగా టాక్ నడుస్తున్నా.. తాను ఈ సిరీస్ ఆడాలని విరాట్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో భారత్‌ వచ్చే నెలలో మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు విండీస్‌తో ఆడనుంది.