అమ్మో ఆ సినిమా పోస్టరే నిజమైంది…!

అతనికి సినిమాలంటే చచ్చేంత పిచ్చి, టెంట్ హౌస్ యజమానిగా ఉండి సినిమాల్లో చాన్స్ ల కోసం ట్రై చేశాడు. చివరికి సినిమాలో విలన్ చాన్స్ రావడంతో తాను నటించిన ఆ సినిమా పోస్టర్ ని ముచ్చట పడి గోడలనిండా అతికించాడు. అది విలన్ చనిపోయే సీన్ కోసం వేసిన శ్రద్ధాంజలి పోస్టర్లు కావడంతో చూసిన వారంత అవాక్కయ్యారు. సరిగ్గా వారం రోజుల తరువాత అదే తరహా పోస్టర్లు మళ్లీ వెలిశాయి. ఇంకోసారి తమ మిత్రుడు కామెడీ చేస్తున్నాడులే అనుకున్నారంతా. కానీ జరిగింది మాత్రం వేరు. ఈ సారి ఆయన నిజంగానే చనిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

తమిళనాడు తూత్తుకూడి జిల్లా కాయల్‌పట్టినంకు చెందిన ఆర్‌ఎస్‌ గోపాల్‌ టెంట్ హౌస్ ను నిర్వహిస్తూ సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నాడు. ఓ సినిమాలో విలన్ గా నటించాడు. ఆ సినిమాలో అతను చనిపోయే సీన్ ఉండటంతో, వీధుల్లో ‘శ్రద్ధాంజలి’ పోస్టర్లు వేసి, కొన్ని సీన్స్ షూట్ చేశారు. గోపాల్ సరదాగా, వీటిని తన సోషల్ మీడియా ద్వారా బంధుమిత్రులకు పంపాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వారు, పూలదండలు తీసుకుని, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చేసరికి, ఇంట్లో గోపాల్‌ చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. విషయాన్ని వారికి వివరించి, ఆ పోస్టర్లను చింపివేస్తూ, ఫొటోలకు పోజులిచ్చాడు కూడా. ఈ ఘటన వారం క్రితం జరిగింది.

తిరిగి ఇదే తరహా పోస్టర్లు కనిపించాయి. ఇది కూడా సినిమా ప్రమోషన్ అని పలువురు భావించారు. కొందరికి అనుమానం వచ్చి ఫోన్ చేయగా, అనారోగ్య కారణాలతో గోపాల్‌ మృతి చెందినట్లు తెలిసింది. దీంతో అవాక్కైన వారు, అశ్రునయనాలతో అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది. తన చావు పోస్టర్లను తానే ప్రచారం చేసుకున్న గోపాల్, నిజంగానే మరణించిన ఘటనపై ఈ ప్రాంతంలో పెద్ద చర్చే జరుగుతుంది.