తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ ఇంకెంత వెనుకబడి ఉంది?

ప్రభాస్‌ ‘సాహో’ చిత్రం దారుణమైన టాక్‌ను తెచ్చుకుంది. 350 కోట్ల మూవీ మరీ ఇలా ఉండటం ఏంటీ అంటూ సుజీత్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అయితే కొందరు మాత్రం సుజీత్‌ తన ప్రయత్నం తాను చేశాడంటూ మద్దతుగా నిలుస్తున్నారు. భారీ బడ్జెట్‌ అవ్వడంతో ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా భారీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. దాంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు దారుణమైన నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నైజాం ఏరియాలో కాస్త పర్వాలేదు అనిపించినా ఏపీలో ఈ చిత్రం భారీ నస్టాలను చవిచూడబోతున్నట్లుగా అనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకోవాలి అంటే దాదాపుగా 120 కోట్లు సాధించాలి. కాని ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్లు వసూళ్లు నమోదు అయ్యాయి. మామూలుగా స్టార్‌ హీరోల సినిమాలకు 80 కోట్ల షేర్‌ అంటూ చాలా ఎక్కువ. కాని ప్రభాస్‌ ముందున్న లక్ష్యంను చూస్తే 80 కోట్లు చాలా తక్కువ అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల బయ్యర్లు బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలి అంటే ఖచ్చితంగా మరో 40 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ఇక లాంగ్‌ రన్‌లో ఎంత ప్రయత్నించినా కూడా 10 నుండి 15 కోట్ల కంటే ఎక్కువ రాబట్టడం సాధ్యం కాదు. అంటే నష్టం 25 నుండి 30 కోట్లు ఉండటం ఖాయంగా కనిపిస్తుంది.