ప్రశాంతంగా జరుగుతున్న చంద్ర‌గిరి రీపోలింగ్‌..

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఏడు కేంద్రాల్లో రీపోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు పాకాల మండలం పులివర్తిపల్లి, కుప్పంబాదురు, రామచంద్రాపురం మండలంలోని ఎన్.ఆర్‌.కమ్మపల్లి, కమ్మపల్లి, కొత్తకండ్రిగ, వెంకటరామపురం, కాళేపల్లిలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.

మొద‌ట అయిదు బూత్‌ల‌ల్లో మాత్ర‌మే రీపోలింగ్ చేప‌ట్టాల‌ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యిన‌ప్ప‌టికీ- చివ‌రి నిమిషంలో కాలేప‌ల్లి, కుప్పంబాదూరుల‌ను ఈ జాబితాలో చేర్చింది. ఈ ఏడు పోలింగ్ కేంద్రాల ప‌రిధిలో మొత్తం 5,451మంది ఓటర్లు ఉన్నారు. త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. రీపోలింగ్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రత కల్పించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి 250 మంది పోలీసులు, ఒక ఐపీఎస్‌ స్థాయి అధికారి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.