గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం

Chandrababu-Another-Foreign-Tour-Confirmed గ్రామాల్లో మరుగుదొడ్లు, అంతర్గత రహదారులు, వ్యర్ధ పదార్ధాల నిర్వహణ, ఫాం పాండ్స్‌ ఏర్పాటుపై అన్ని శాఖలు కలిసి దృష్టి పెట్టాలని, ఈ కార్యక్రమాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమన్వయ పరుచుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎన్.ఆర్.ఇ.జి.ఎ నిధులను ఇందుకోసం వినియోగించుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయి అధికారులు, వివిధ శాఖాధిపతులతో మంగళవారం విజయవాడలోని తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తాను చేపట్టిన జన చైతన్యయాత్రల అనుభవాలను వివరించారు.

గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలు-పురోగతిపై ఆర్ధిక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి కోరారు. గ్రామాల్లో ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన సిమెంట్ రోడ్ల నిర్మాణంపై ప్రజల నుంచి సంతోషం వ్యక్తమవుతోందని చెప్పారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పెన్షన్లు, బియ్యం సక్రమంగా అందుతున్నాయని, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు.

నెలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం బహుళ ప్రజాదరణ పొందిందన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళిక కింద నిధులను సద్వినియోగం చేస్తున్నామని చెప్పారు. ఎన్.ఆర్.ఇ.జి.ఎ నిధులతో ఫాం పాండ్స్ ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మరోవైపు ఎన్.ఆర్.ఇ.జి.ఎ, ఉప ప్రణాళికల పనులు పురోగతిలో ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి శ్రీ జవహర్‌రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.