సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పెద్దల కళ్లు తెరిపించాయి. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తేలిగ్గా తీసుకున్న అధిష్టానం .. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రాష్ట్రాల ప్రచారాలకూ దిగివస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే, ఇక ఎప్పటికీ డబుల్ డిజిట్ సీట్లు కూడా సాధించలేమన్న వాస్తవాన్ని గ్రహించి, దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అక్టోబర్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం కోసం సన్నద్ధమైంది. పార్టీ అధినేత్రి సోనియా, యువరాజు రాహుల్ గాంధీలతో సహా ప్రచార సారధుల జాబితాను సిద్ధం చేసింది. నేటి నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనా, ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు. మరోవైపు హర్యానా ప్రచారంలో సోనియా, రాహుల్లు పాల్గొంటారని హర్యానా సీఎం హుడా స్పష్టం చేశారు.