మళ్ళీ టీడీపీలోకి దేవినేని నెహ్రూ సోదరుడు

devineni-chandrasekharతెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు నాయుడు చేపట్టిన “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర తెలుగు తమ్ముళ్ళకు దిశానిర్దేశం చేయడంతో పాటు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపుతుంది. కొద్దికాలంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన వారు సైతం ఒక్కొక్కరిగా మళ్ళీ పార్టీలోనికి వస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే కృష్ణా జిల్లాలో సోమవారం చంద్రబాబు నాయుడు సమక్షంలో దేవినేని నెహ్రూ సోదరుడు దేవినేని చంద్రశేఖర్ మళ్ళీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీపైన అభిమానంతోనే టీడీపీలో చేరినట్లు స్పష్టంచేశారు. పార్టీతనపై నమ్మకం వుంచి ఏ పదవి ఇచ్చినా దానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. అయితే పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూపైన పోటీ చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కృష్ణ జిల్లాలో టిడిపి చనిపోయిందన్న కొందరు ఇతర పార్టీల నేతలకు తన చేరికే సరైన సమాధానం అని ఆయన అన్నారు. చంద్రశేఖర్ చేరిక సందర్భంగా.. చందూ యువసేన భారీగా తరలి వచ్చింది. కాగా దేవినేని చంద్రశేఖర రావు గతంలో టిడిపి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే.