ముస్లింలకు ప్రధాని బాసట!

modiదేశభక్తి ముందు కుల, మతాలే కాదు… జాతి విభేదాలు కూడా బలాదూరే. ‘నేనూ..
నా దేశం’ అన్న భావనే దేశభక్తి ఆవిర్భావానికి మూల కారణంగా పనిచేస్తోంది. అలాంటి దేశభక్తితోనే భారతీయ ముస్లింలు పనిచేస్తారని భారత ప్రధాని వ్యాఖ్యానించారు. భారత గడ్డపై జన్మించిన ఏ ముస్లిం అయినా దేశం కోసం అవసరమైతే ప్రాణాలర్పిస్తారని మోడీ అన్నారు. భారతీయ ముస్లింలను ఆల్ ఖైదా ప్రేరేపిస్తుందంటూ విడుదలైన వీడియోలకు సంబంధించి మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతీయ ముస్లింలు దేశం కోసమే బ్రతుకుతారని, అవసరమైతే దేశం కోసమేప్రాణాలిస్తారని మోడీ అన్నారు. అంతేకాదు… దేశానికి వ్యతిరేకంగా పనిచేయాలన్న ఆలోచన కూడా భారతీయ ముస్లింలకు రాదని ప్రధాని స్పష్టం చేశారు. అయితే, దేశంలోని ముస్లింలను కొంతమంది సంఘవిద్రోహులు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు వాడుకోవాలని భావిస్తున్నారని ప్రధాని అన్నారు. భారతీయ ముస్లింలను పావులుగా చేయాలని యోచిస్తున్నారన్నారు. భారతదేశంలో ముస్లింలు ఒక జాతి అని, వారు సమయానుకూలంగా ఎటుబడితే అటుమారే వారు కాదని మోడీ తెలిపారు.

ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో విస్తరించిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదాలో భారత ముస్లింలు ఉండకపోవచ్చనే ధీమాను ప్రధాని వ్యక్తం చేశారు. భారత్‌ లో తీవ్రవాద సంస్ధ ఆల్‌ ఖైదా ఆటలు సాగవని మోడీ స్పష్టం చేశారు.

మరోవైపు, ప్రధాని మోడీ వ్యాఖ్యలను ముస్లిం పెద్దలు స్వాగతించారు. మేరా భారత్‌ మహాన్‌ అంటూ శ్లాఘించారు. పోలీసులు ప్రతిసారి అనుమానిస్తున్నట్లు తాము ఉగ్రవాదులకు తొత్తులం కాదని అంటున్నారు. భారత్ మాత అంటే మాకు అమితమైన ప్రేమ, అనురాగం వున్నాయని ముస్లిం సోదరులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి.. ప్రధాని భారత ముస్లింలకు సంపూర్ణమైన మద్దతును తెలపడం నిజంగా మంచి పర్యాయమే.