తెలంగాణ సమస్య పరిష్కారానికి తుది గడువు అంటూ ఏదీ లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ సోనియాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆజాద్ మాట్లాడుతూ తెలంగాణ సమస్య పరిష్కారానికి కొంత సమయం అవసరం అన్నారు. తెలంగాణ అంశం సున్నితమైందని ఆయన వెల్లడించారు. తెలంగాణపై చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. 28వ తేదీన తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినంత మాత్రాన ఇప్పుడు ప్రకటన చేయలేం అన్నారు. నెలలోనే నిర్ణయం చెప్పాలనడం సరికాదన్నారు. ప్రకటన చేయడం మీడియా అడిగినంత సులభం కాదని చెప్పారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నందున ప్రకటనలో జాప్యం జరగొచ్చని, ఖచ్చితంగా 28న ప్రకటన వస్తుందని చెప్పలేమని వివరించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. త్వరలోనే తెలంగాణపై ప్రకటన వస్తుందని ఆయన పేర్కొన్నారు.