సీఎం కిరణ్ నిర్వేదంలో ఉన్నారా? ఇప్పటి దాకా రాష్ట్ర విభజన అడ్డుకుంటాను అంటూ ధీమా ప్రదర్శించిన సీఎంలో మార్పు కన్పిస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎంలో కన్పించిన మార్పు అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. సహజమైన ప్రసంగానికి భిన్నంగా సీఎం కేవలం ఆరు నిమిషాల్లో స్పీచ్ ముగించారు. రాష్ట్ర ప్రజలు అయోమయంలో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఈ వాదానికి బలం చేకూర్చాయి.
మరో వైపు సీఎం కిరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై పలువురు తెలంగాణ నేతలు మండిపడ్డారు. ఏ ప్రజల అభీష్టం కొసం సీఎం నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు జానా రెడ్డి. సీఎం కిరణ్ వ్యవహరాన్ని హైకమాండ్ గమనిస్తోందని గుర్తు చేశారు.
మరో నేత విహెచ్ హనుమంత రావు మాట్లాడుతూ… ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకున్నానంటున్న కిరణ్… సోనియాను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. బూర్గుల రామకృష్ణారావును ఆదర్శంగా తీసుకుంటే… సీఎం కిరణ్ పదవీ త్యాగం చేసి చరిత్రలో నిలవాల్సివుంటుందని తెలిపారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అవతరణ వల్లనే నిర్మించబడ్డాయని సీఎం అనడం సరైందికాదన్నారు. ప్రజలను ఎవరు మోసం చేశారో అఖిలపక్ష సమావేశం ద్వారా తెలిసిపోతోందని వీహెచ్ తెలిపారు.