జగన్ ను కలిసిన మోహన్ బాబు..

వారం రోజుల క్రితం ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఫై విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన భుజానికి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు శుక్రవారం ఉదయం జగన్ ఇంటికి వచ్చి ఆయన యోగ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు.. జగన్ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని.. ఆయన వందేళ్లు బతుకుతారని ఆకాంక్షించారు. రాహుల్ గాంధీ-చంద్రబాబు భేటీపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదని వ్యాఖ్యానించారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలపై తానే మాట్లాడాతనని చెప్పుకొచ్చారు.